TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాయలసీమలో వైసీపీ ఖాళీ.. జనసేన వ్యూహం అదేనా?

Published on: Thu Jul 9, 2026 3:56PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.  ముఖ్యంగా  రాయలసీమ పరిధిలోని ఉమ్మడి ఆరు జిల్లాలలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోంది. ఇందుకు కారణం ఈ ప్రాంతంపై  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించడమే అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జనసేన  ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరలేపి.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే.. తాజాగా  జనసేనలోకి  చేరికలను సమీక్షించడానికి 14 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి చేరికల కమిటీని జనసేనాని ఏర్పాటు చేశారు.   ఈ కమిటీలో ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  కీలకమైన బాధ్యతలను అప్పగించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాలపై బాలినేనికి ఉన్న పట్టును ఉపయోగించుకుని..  ఆయా జిల్లాలలో వైసీపీ అసంతృప్తి నేతలను జనసేనలోకి ఆకర్షించాలన్న వ్యూహంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం  పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకు వైసీపీ ద్వితీయ శ్రేణి, అలాగే పది మంది వరకూ సీనియర్, కీలక వైసీపీ నేతలు జనసేనలోకి చేరుందుకు ఇప్పటికే మాటాముచ్చటా జరిగిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.  గత ఎన్నికలలో కేవలం కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయిన జనసేనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడినికీ, మరీ ముఖ్యంగా రాయలసీమలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. ఓటమి తరువాత వైసీపీలో నైరాశ్యం కమ్ముకుంది. అటు క్యాడర్, ఇటు లీడర్ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉంటున్న దాఖలాలు కనిపించడంలేదు. 

దీంతో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో పడ్డ వైసీపీ నేతలు, పార్టీ వీడే యోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలోచర్చ జరుగుతోంది. అలా పార్టీని వీడాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు తెలుగుదేశం, జనసేన మాత్రమే. అయితే తెలుగుదేశంలో చేరికకు అవకాశం లభించినా, అక్కడ ఇప్పటికే సీనియర్లు చాలా మంది ఉండటంతో తమకు సముచిత స్థానం లభించే విషయంలో అనుమానాలు ఉన్న వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీలోకి చేరికలకు పచ్చ జెండా ఊపారు.  

Pawan Kalyan, Balineni Srinivasa Reddy, Greater Rayalaseema, YSRCP Leaders, Telugu One