TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది!

Published on: Wed Nov 6, 2024 1:35PM

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కుప్పం విషయంలో  ఆ పార్టీ నేతలు పెచ్చులు మాట్లాడారు. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడటం ఖాయమంటూ గప్పాలు కొట్టారు.  ముఖ్యంగా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయిని మించి వ్యవహరించారు. కుప్పం స్థానిక సంస్థలను అధికార బలంతోనూ, సొమ్ములు గుమ్మరించడం ద్వారా లాక్కొని ఇంకే ముంది కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందంటూ విర్రవీగారు.   2019-2024 మధ్య కాలంలో వైసీపీ ఇంకేముంది కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగానే కుప్పంలో వైసీపీ బలపడిందా అన్న భ్రాంతి కలిగేలా వారి తీరు అప్పట్లో ఉంది. అయితే అదంతా కేవలం గాలి బుడగ వాటమని 2024 ఎన్నికలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మరుక్షణం ఐదేళ్ల పాటు కుప్పంలో అరాచకాలు చేసి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారు కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. పోటీ చేసి ఓడిపోయిన భరత్ అసలు అడ్రస్ లేరు. అక్కడే ఉన్న వాళ్లు టీడీపీలో చేరిపోతామని బతిమాలుకుని ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకునేవారు కరువయ్యారు. చంద్రబాబును ఓడించేస్తానని హడావుడి చేసిన పెద్దిరెడ్డి కూడా అటు వైపు చూడటం లేదు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది.

చంద్రబాబు సునాయాసంగా కుప్పం నుంచి వరుసగా ఎనిమిదో సారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటిదాకా కుప్పం మాదే నంటూ విర్రవీగిన వైసీపీయులు ఓటమి తరువాత నియోజకవర్గంలో కలికానిక్కూడా కనిపించకుండా పోయారు. కుప్పం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  కె.ఆర్‌.జె.భరత్‌ హైదరాబాద్‌కు మకాం మార్చేశారు.

ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా తెలుగుదేశం వశమౌతున్నాయి. కుప్పం మునిసిపల్ చైర్మర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.  మొత్తానికి కుప్పంలో వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.