TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తీరు.. వైసీపీ క్యాడర్ బేజారు!

Published on: Tue May 19, 2026 10:13AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వైసీపీ  ప్రస్తుతం ఉనికిమాత్రంగా మిగిలిపోయింది. ఒకరిద్దరు నేతలు వినా మరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్  రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత,  జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి. ఇక ఏపీకి జగన్ చుట్టపు చూపుగా వస్తుండటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడం తప్ప చొరవ తీసుకుని పార్టీని, క్యాడర్ ను ముందుకు నడిపించడంలో ఎటువంటి చొరవా తీసుకోవడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.  

ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విపక్షం వైసీపీ మాత్రమే. అటువంటి పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే విషయంలో జగన్ ఉదాశీనంగా వ్యవహరించడంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించడంలో గానీ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గానీ పార్టీ శ్రేణులు పెద్దగా ఉత్సాహం చూపని పరిస్థితులు నెలకొని ఉండటానికి జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా బెంగళూరులోనే ఎక్కవ కాలం మకాం ఉండటం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని  నేరుగా రంగంలోకి దిగి, పార్టీని గాడిలో పెట్టకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఇక పోతే రాజకీయవర్గాలలో అయితే.. జగన్ రాజకీయ సన్యాసం చేశారా? లేక వ్యూహాత్మకంగా క్రియాశీలంగా ఉండటం లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను అడపాదడపా సోషల్ మీడియా వేదికగానో, తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే విమర్శించడం వినా..   ప్రజాక్షేత్రంలోకి వచ్చి గళమెత్తకపోవడంతో జగన్ ప్రభావం ఏపీ రాజకీయాలలో నామమాత్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.