ఫేస్ బుక్ లో అసభ్యకర పోస్ట్ లు.. యామినిపై పోలీసులకు ఫిర్యాదు

 

తన పేరుతో ‘ఫేస్ బుక్’ లో ఫేక్ అకౌంట్స్ ను తెరిచి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈరోజు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా యామిని మీడియాతో మాట్లాడుతూ.. తన ఫేస్ బుక్ అధికారిక పేజీ సాధినేని యామినీ శర్మ పేరిట ఉందని చెప్పారు. ఇది కాకుండా కొందరు ‘యామిని సాధినేని’, ‘యామిని సాధినేని యువసేన’.. ఇలా ఫేక్ అకౌంట్స్ ను సృఫ్టించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, ఇతర నాయకులపై అసభ్య పదాలు వాడుతూ తాను చేసినట్టుగా ఈ పోస్టింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్ట్ లను నిజంగా తానే చేశానని నెటిజన్లు భావిస్తూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.

ఇలాంటి పోస్ట్ ల వల్ల తనకు, తన కుటుంబానికి, పార్టీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం వాటిల్లుతోందని చెప్పారు. తన పేరిట ఉన్న ఫేక్ అకౌంట్స్ ను వెంటనే తొలగించాలని, సైబర్ చట్టాన్ని మరింత కఠినతరం చేసి.. రాజకీయాల్లో ఉన్న ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరింత భరోసా కల్పించాలని సీఎం జగన్ ని, డీజీపీని కోరుతున్నానని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఎక్కువై పోయిందని, అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నారని యామిని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు యామిని పై వైసీపీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ ని కించపరుస్తూ ఫేస్ బుక్ పోస్ట్ చేశారని ఆరోపిస్తూ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వైసీపీ నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ.. యామిని తన తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మొత్తానికి ఫేక్ అకౌంట్స్ పుణ్యమా అని ఒకవైపు ట్రోల్ల్స్, మరోవైపు కంప్లైంట్స్ యామినిని చుట్టుముడుతున్నాయి.