ఇక రేవంత్ ముఖం చూడను, ఆయనతో మాట్లాడను : కోమటి రెడ్డి వెంకటరెడ్డి
Published on: Fri Aug 5, 2022 5:12PM
కాంగ్రెస్ అనుమానాలే నిజమౌతాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరి తరువాత ఒకరుగా కమలం గూటికి చేరనున్నారా? ముందుగా తమ్ముడు ఆ తరువాత అన్న అన్న వ్యూహం అమలు చేస్తున్నారా అన్నసందేహాలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. ఎందుకంటే స్వల్ప వ్యవధిలో కోమటి రెడ్డి బ్రదర్స్ కేంద్ర మంతి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇద్దరూ వేర్వేరుగానే కెళ్లి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ పరిశీలకులు మాత్రం సోదరులు కూడబలుక్కునే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరడం ఖరారైన నేపథ్యంలో ఆయన అమిత్ షాను వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతుంటే.. ఆయన తరువాత విడిగా వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో వరద బాధితుల కష్టాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు కలిశానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందనీ, కేంద్రం ఆదుకోవాలనీ కోరేందుకే తాను అమిత్ షా తో భేటీ అయ్యానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ లో కల్లోలాన్నీ, చిచ్చునూరేపుతున్నాయి.
గత ఏడాది కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసమ్మతిని, అసంతృప్తినీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నా ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికంఠాకూర్ ఏ మాత్రం ప్రయత్నించలేదని పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు కూడా చేశారు.
రేవంత్ రెడ్డి తీరు కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ ను వీడితే నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోవడం ఖాయమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదుకు తగినట్లుగానే పార్టీ వీడనని ఒక వైపు చెబుతూనే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలు గుప్పించడం.. పార్టీతో ప్రమేయం లేకుండా వరద సాయం కోసమంటూ నేరుగా హోంమంత్రిని కలవడం వంటి చర్యలతో వారి ఫిర్యాదు వాస్తవమేనని సంకేతాలిస్తున్నారు. తాజాగా చెరుకు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంపై రేవంత్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి పిలిచి పీసీసీ పీఠం అప్పగించడంపై మండి పడ్డారు. ఇకపై రేవంత్ ముఖం చూడనని శపథం చేశారు.


