వచ్చేది నేనే.. కబడ్దార్.. తప్పు చేసిన అధికారుల తుప్పు వదలగొడతా.. బాబు
Published on: Sat Jul 2, 2022 3:42PM
తప్పుడు అధికారుల తుప్పు వదలగొడతా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేననీ.. ఇప్పుడు తప్పులు చేసిన అధికారులెవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. సీబీ సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ వరకూ వెళ్లిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని దుయ్యబట్టారు. సుప్రీం నిబంధనల తోసి రాజని మరీ సీబీసీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సీబీసీఐడీ చేస్తున్న అరెస్టులను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును సీబీసీఐడీ అధికారులు డీల్ చేసిన విధానంపై జగన్ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కొందని గుర్తు చేసిన చంద్రబాబు.. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అని నిలదీశారు.
కొద్ది మంది కళంకిత అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సామాజి క మాధ్యమంలో చురుకుగా ఉండే వెంకటేశ్, సాంబశివరావు వంటి వారి విషయంలో సీబీసీఐడీ వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందన్నారు.
రాబోయే ప్రభుత్వం తెలుగుదేశందే అన్న చంద్రబాబునాయుడు కళంకిత అధికారులను వదిలే ప్రశక్తే లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదేనన్న చంద్రబాబు. కార్యకర్తలనే కాదు.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పారు.


