TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగేనా?

Published on: Mon Jul 25, 2022 4:26PM

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రతి మాటా, ప్రతి కదలికా, ప్రతి చర్యా, ప్రతి ప్రసంగం ఆ విషయాన్నే చెబుతుంది.

అయితే వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా అంటే మాత్రం కనీసం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అందులో వైసీపీ వాళ్లు మినహాయింపు ఎంత మాత్రం కాదు. నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నించే ఎమ్మెల్యేలకు ఆయన దర్శనమే దొరకదు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్క సారి కూడా సీఎంను కలుసుకోవడానికి కనీస అవకాశం దొరకని ఎమ్మెల్యేల సంఖ్య వందకు పైగానే ఉంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. జగన్ చెబుతున్నట్లు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరిగే పని కాదని ఆ పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తే ముందుగా చర్చకు వచ్చేది ఆ నియోజకవర్గంలోని సమస్యలేనని అంటున్నారు. అయితే ఆ సమస్యలను అడ్రెస్ చేసే తీరిక కానీ, ఓపిక కానీ జగన్ కు లేవనడానికి గడప గడపకూలో ఎదురౌతున్న సమస్యలను జగన్ కు తెలియజెప్పడానికి యత్నించిన ఎమ్మెల్యేలకు ఆయన విసుగు, చిరాకు ఎదురైన సంగతిని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నరు. రోజుకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గానికి చెందిన ఓ 50మంది ముఖ్యులతో సమావేశమైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, మరో వైపు నియోజకవర్గాల వారీగా సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు రెంటినీ అవాయిడ్ చేసే అవకావం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

నియోజకవర్గాల వారీ సమావేశాలలో అనివార్యంగా ప్రజా సమస్యలే ముందుగా చర్చకు వస్తాయి. అవి చర్చకు రాగానే వాటి పరిష్కారాన్ని సీఎం సూచించాలి. అలా సూచించడానికైనా ముందుగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయాలి. ఏ విధంగా చూసినా ఇప్పుడు నియోజకవర్గాలలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే పరిస్థితే లేదు. వీటన్నిటికీ మించి తమ ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీ నేతలకు చేసిన పనులకు ఇన్నేళ్లుగా బిల్లులు రాలేదు. ఆ బిల్లులు చెల్లించకుండా జగన్ మాత్రం ఏ ముఖం పెట్టుకుని వారితో సమావేశం కాగలరు అని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.

చివరాఖరికి ఇటీవలి వరదల సమయంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చిన పడవలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు వడుదల చేస్తుందని ఆశించడం దురాశే అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో జగన్ చెప్పినట్లుగా వచ్చే నెలనుంచి నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి పార్టీ శ్రేణులు.