TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు అమరావతి గండం

Published on: Thu Mar 26, 2026 3:38PM

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం (మార్చి 28) రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ముద్ర వేయించుకోవడానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఈ సమావేశం  ఆమోదించనుంది. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యం ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది.

రాజధాని విషయంలో గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే..  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ ఉండాలని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల అనంతరం..  గతంలో ఉన్న సీఆర్డీయే  2014 చట్టానికి సంబంధించిన తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.

అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీలులేకుండా గట్టి పునాది వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం   ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి  వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకపోతే.. రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయంటున్నారు.  మూడు రాజధానుల వైఖరిని ప్రజలు గత ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.   

గత ఏడాది కాలంగా వైసీపీ నేతలు అమరావతి రాజధాని విషయంలో ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో రాజధాని విధానంపై పునరాలోచన చేస్తామని ప్రకటించినా, అధినేత జగన్ నుండి మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కోసం జరుగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరిస్తే..   అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదనీ, రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదనీ సందేహాలకు అతీతంగా తేలిపోతుంది. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా తేరుకోలేని నష్టం జరగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.   

అమరావతికి సంబంధించి కీలక తీర్మానం చేయడం కోసం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వస్తారా? రారా అన్నది స్పష్టత లేదు. గతంలో అంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా విస్పష్టంగా చెప్పి అమరావతికి మద్దతు పలికిన జగన్ ఆ తరువాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో  అమరావతిని నిర్వీర్యం చేశారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా ?   ఒకవేళ మద్దతు ఇస్తే ఐదేళ్ల తమ పాలనలో తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇక మద్దతు ఇవ్వకుంటే.. జగన్ అమరావతికి వ్యతిరేకి అన్న ముద్ర పడుతుంది. అందుకే జగన్ డుమ్మా కొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.