TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమబెంగాల్ ఎన్నికలు.. అమిత్ షా జోస్యం నిజమౌతుందా?

Published on: Sat Apr 25, 2026 3:15PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది. 

ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు. 

 అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

-సీతారాం కంఠంనేని