ఆస్తి రాసివ్వలేదని.. భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

 

ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై.. భార్య వేడినీళ్లు పోసిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ అయోధ్యనగర్‌ అయోధ్య టవర్స్‌లో నివసించే అట్లూరి వెంకటరమణ(49) హైదరాబాద్‌లో భవన నిర్మాణ పనులు చేయిస్తుంటారు. ఈయనకు హేమలత(43)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. హేమలత వాంబేకాలనీలోని నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. భర్త పేరిట ఉన్న ఆస్తులను తన పేరిట, పిల్లల పేరిట రాయాలని పలుమార్లు కోరినా భర్త పట్టించుకోలేదు. దీంతో ఈ విషయంపై తరుచూ గొడవ జరుగుతూ ఉండేది. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు వెంకటరమణ నీళ్లు స్టౌపై పెట్టుకున్నారు. అవి కాగుతుండగా హేమలత ఓ గిన్నెలో వాటిని తీసుకుని భర్త వీపుపై పోసింది. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.