ఎన్టీఆర్ ఈవెంట్లో జూనియర్ ఎక్కడ?
Published on: Mon Apr 4, 2022 3:49PM
ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తో యంగ్ టైగర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోగా ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. ఇటీవల 40 వసంతాలు పూర్తి చేసుకొంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లో సైతం.. ఆ పార్టీ పండగను లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఓ వేడుకలా జరుపుకున్నారు. అలాంటి వేళ.. ఆ పార్టీలో ఆ సంతోషకర వాతావరణ నెలకొన్న వేళ.. ఎన్టీఆర్.. జస్ట్ ఒక్క మాట.. ఒకే ఒక్క డైలాగ్ పేల్చితే.. ఆ తీరే వేరుగా ఉండేది. కానీ, జూనియర్ నోరు మెదపలేదు. టీడీపీ 40 వసంతాల వేడుక గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కేడర్ను విష్ కూడా చేయలేదు.
తాతా తాతా అంటూ.. మా తాత పార్టీ అంటూ పదే పదే పలికే బుడ్డోడు.. ఆ తాత స్థాపించిన పార్టీ చారిత్రక మైలురాయిని చేరిన సందర్భంలోనైనా స్పందించి ఉంటే బాగుండేది. ఒక్క మంచి మాటైనా అనుంటే తమ్ముళ్లు ఖుషీ అయ్యుండే వారు. కానీ, జూనియర్ అసలేమాత్రం స్పందించకుండా.. తనకేం సంబంధం లేదన్నట్టు ఉండడంపై పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు అంతా తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి లోనవుతున్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరే.. ఈ యంగ్ టైగర్ కూడా పెట్టుకున్నారని.. ఆ పేరులో ఎంత వైబ్రేషన్ ఉందో.. ఈ పేరులో కూడా అంతే వైబ్రేషన్ ఉందని.. ఆ పేరులో ఎంత హై ఓల్టేజ్ ఉందో.. ఈ పేరులో కూడా అంతే హైఓల్టేజ్ ఉందని పార్టీ కేడరంతా ముక్తకంఠంతో మరీ చెబుతోంది. అటు ఆ పెద్దాయన.. ఇటు ఈయన ఇద్దరు ఇద్దరేనని.. అదీ నటనలోనైనా.. నడతలోనైనా.. మాటలోనైనా.. మనన్నలోనైనా.. డైలాగ్ డెలివరిలోనైనా.. ఎక్కడైనా ఆ తాతకు తగ్గ మనవడీ ఎన్టీఆర్ అని మరీ గుర్తు చేస్తోంది. వెండి తెర ఇలవేల్పు ఆ ఎన్టీఆర్ని అచ్చుగుద్దిపారేశాడీ జూనియర్ ఎన్టీఆర్ అనే టాక్ అయితే ప్రపంచంలోని తెలుగు ప్రజల్లో బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసందే. అలాంటిది.. పార్టీ 40 వసంతాల వేళ... జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల.. పసుపుపార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా హార్ట్ అయిందని తెలుస్తోంది.
అయితే గతంలో చంద్రబాబు భార్యా నారా భువనేశ్వరిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత చంద్రబాబు.. అసెంబ్లీని బాయ్ కాట్ చేసి.. ప్రెస్మీట్ పెట్టి కన్నీరు మున్నీరు కావడం.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా మీడియా ముందుకు రావడం.. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ మొత్తం వ్యవహరంపై స్పందిస్తూ.. ఓ వీడియోని విడుదల చేసి.. ఆ తర్వాత కామ్ అయిపోయారు.
కానీ సదరు వీడియోలో ఎన్టీఆర్.. కర్ర విరగకొడదూ. పాము చావకూడదు అనే టైప్లో మాట్లాడారంటూ అనాడే టీడీపీలోని చంద్రబాబు వర్గం నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న మీడియా సాక్షిగా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనిపై కూడా ఎన్టీఆర్ స్పందించ లేదు. ఓ వేళ.. తాతగారి పార్టీ 40 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా స్పందిస్తే.. తన వ్యాఖ్యలపై మళ్లీ రచ్చ జరిగే అవకాశం ఉందని ముందుగానే పసిగట్టి.. ఈ యంగ్ టైగర్ కామ్ అయి పోయి ఉంటారనే ఓ చర్చ కూడా తెలుగు నేలపై సవారీ చేస్తోంది.


