జగన్ ప్రకటన..చంద్రబాబు అమలు
posted on Jan 11, 2019 4:48PM
ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయటం సర్వసాధారణం. కానీ ప్రతి పక్ష పార్టీ హామీ ఇస్తే అధికారంలో ఉన్న పార్టీ అమలు చేయటం ఆలోచించదగ్గ విషయమే. అది కూడా చంద్రబాబు వంటి అపర చాణిక్యుడు చేయటం గమనార్హం. తాజాగా ఏపీ పముఖ్య మంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకను ప్రకటించారు. ఫించన్ మొత్తాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల ఫించన్ ను రూ.2 వేలకు పెంచారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న రూ.1500 ఫించన్ కూడా రెట్టింపు చేశారు. ఇంత అర్ధాంతరంగా చంద్రబాబుకి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అనుకుంటున్నారా అంతా ఎన్నికల మహిమ. అంతేకాకుండా ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ ప్రకటనకు కారణమే.
అసలు ఈ పధకం జగన్ చేసిన నవరత్నాల ప్రకటనలో ఒకటి. 14 నెల ల పాదయాత్రలో ప్రతీ చోటా జగన్ ఇచ్చిన హామీ. జగన్ ఇస్తున్న హామీలపై టీడీపీ ఓ కన్నేసింది. ఆ హామీల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాల పై నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించింది. అందులో పెన్షన్ల పెంపు అంశం పై సానుకూలత ఉన్నట్లుగా గుర్తించింది. తాము అధికారంలోకి రాగానే 200 గా ఉన్న పెన్షన్ ను వెయ్యి రూపాయాలు చేసాం. ఇప్పుడు జగన్ రెండు వేలకు పెంచుతామని ప్రకటిస్తున్నారు. జగన్ కు ఎందుకు ఆ క్రెడిట్ దక్కాలి. అధికారంలో ఉన్న మననే ఈ నిర్ణయం అమలు చేసి ప్రజల్లో ఇమేజ్ దక్కించుకుందామని చంద్రబాబు భావించినట్లు సమాచారం. ఫలితంగా పెన్షన్ల పెంచుతున్నట్లు,తక్షణమే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
జగన్ ప్రకటించారు..చంద్రబాబు అమలు చేశారు. అయితే ఇక్కడే చిన్న చిక్కు ఉంది. మనకి కాదు ఆ రెండు పార్టీలకు. జగన్ హామీని కాపీ కొట్టినందుకు ప్రజలు జగన్ వైపు ఉంటారా? లేక అమలుచేసింది చంద్రబాబు కాబట్టి చంద్రబాబు వైపు ఉంటారా?...ఆ క్రెడిట్ ఎవరికీ దక్కుతుందో? .. గతంలో జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లను రెట్టిం పు చేసి..అమలు చేసినా..ఆ క్రెడిట్ తనకే దక్కుతుందని చెప్పుకొచ్చారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం అధికారంలోకి వస్తాడో..రారో..వచ్చినా అమలు చేస్తారో లేదో తెలియని జగన్ హామీ కంటే..అమలు చేస్తున్న తమనే ప్రజ లు ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చారు. ఎవరికీ వారు బాగానే ధీమాతో ఉన్నారు. కానీ అసలు ప్రజలు ఎవరికి ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తారో మరి కొన్ని నెలల్లో చూసేస్తాం...!!