ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం శాఖలు అన్నీ కత్తిరించేసారు

ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల్లో సమావేశాలు జరిపి తాను సీఎస్ గా పని చేసిన ప్రభుత్వంపైనే భారీ అవినీతి ఆరోపణలు చేసిన అజేయ కల్లాం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య సలహాదారు పదవి పొందారు. ఆయనకు జీఏడీ , హోమ్, ఆర్ధిక శాఖ, రెవెన్యూ, సీఎంవో వ్యవహారాలు వంటి అతి ముఖ్యమైన శాఖలన్నిటిని సీఎం జగన్ కట్టబెట్టారు. జగన్ సీఎం పదవి స్వీకరించే ఫైలు పై దగ్గరుండి మరీ అజేయ కల్లం సంతకం చేయించారు . దీంతో అజయ్‌రెడ్డి కల్లాం గుడ్‌లుక్స్‌లో పడేందుకు సీనియర్ అధికారులు కూడా పోటీ పడ్డారు. ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్న గ్రామసచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఆలోచన కూడా ఆయనదే అంతే కాకుండా పీపీఏల సమీక్ష, రివర్స్ టెండరింగ్ వరకు అన్ని నిర్ణయాల వెనుక ఉన్నది అజేయ కల్లం మాత్రమే. అంతే కాకుండా ఒకప్పుడు తాను వ్యతిరేకించిన వాటినే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయటం వంటి వాటి విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటం ద్వారా అజయ్ కల్లాం వ్యక్తిగతంగా తనకు ఉన్న పేరును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే ఇదంతా గతం ప్రస్తుతం ఆయన అధికారాలు, శాఖలు అన్నీ కత్తిరించేసారు. ఎం జరిగింది ఏమో కానీ ఒక సంవత్సరం తిరిగి వచ్చే సరికి ఆయనకు ఎటువంటి అధికారాలు, శాఖల బాధ్యతలు లేకుండా ఒట్టి సలహాదారుగా మాత్రమే మిగిల్చారు. దీంతో పేరుకు సలహాదారు అనే పదవి ఉంది కానీ ఏ విషయంలో సలహాలివ్వాలో పాపం ఆయనకి కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఆయనతో పాటు సంవత్సరం క్రితం కేంద్ర సర్వీసులో ఉన్న డాక్టర్ పివి రమేష్ ను కూడా సీఎం ఓ ముఖ్య కార్యదర్శి గా నియమించుకుని ఆరోగ్యం, విద్య, వైద్య, ఐటి, పరిశ్రమలు వంటి కీలక శాఖలయూ అప్పగించారు. ప్రస్తుతం పీవీని కూడా అన్ని బాధ్యతల నుండి తప్పించి కేవలం ఒక సలహాదారుగా కొనసాగిస్తున్నారు

ఐతే ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం, పీవీ రమేష్ వంటి వారిని కూడా ఇలా సబ్జెక్ట్ లు లేకుండా చేయటం.. అది కూడా కనీసం ముందుగా పిలిచి ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక అనుభవజ్ఞుడైన అధికారికి ఇది చాలా అవమానకరం అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

ఐతే తాజా ఆదేశాల ప్రకారం.. గతంలో కేటాయించిన సబ్జెక్ట్ ల ఆదేశాలు అన్నింటిని రద్దు చేస్తూ కొత్తగా మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ (వ్యయం మినహా), న్యాయ, లెజిస్లేటివ్ వ్యవహారాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి.

ఇక సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా, రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ,ఐటి, గనులు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ లను కేటాయించారు.

ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మిస్టేషన్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ , ఫైనాన్స్ (వ్యయ విభాగం) కేటాయించారు.