TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్, జగన్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?

Published on: Thu Jul 9, 2026 1:18PM

వాస్తవ వేదిక.. తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పడు  కిచెన్ క్యాబినెట్,  కోటరీ అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ ఉన్న ఆ ముఠాలు ఎవరు?  గ్రౌండ్ రియాలిటీకి, ప్రజా కోణానికి వారు పార్టీల  నేతలను ఎంత దూరం చేస్తున్నారు? అనే అంశాలపై తెలుగువన్ వాస్తవ వేదికలో   జమీన్ రైతు, డోలేంద్ర  ప్రసాద్ ' తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంక్ లు విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   రాజకీయ వ్యూహకర్తలు, కోటరీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న అపకారంపై వారు కూలంకషంగా చర్చించారు. 

గతంలో  ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు వంటి అగ్రనేతలు క్షేత్రస్థాయి నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారన్న డోలేంద్ర ప్రసాద్.. ఒక సాధారణ వ్యక్తి ఎదురైనా పిలిచి మాట్లాడి రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ఓపెన్ మైండ్ నాటి ప్రధానులకు ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ తన పాత కోటరీని పక్కన పెట్టి అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ వంటి కార్పొరేట్ మైండ్స్ ఉన్న వ్యక్తులను కిచెన్ క్యాబినెట్‌లో పెట్టుకున్నారో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు డిస్కనెక్ట్ అయి తీవ్రంగా నష్టపోయిందని  ఉదాహరణలతో వివరించారు.

ఇప్పుడు ఇదే తరహా కోటరీ సంస్కృతి   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోందన్నారు డోలేంద్ర ప్రసాద్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి నమ్మకస్తులైన, రాజకీయ అనుభవజ్ఞులైన కోటరీని  జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి భూస్థాపితం చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు నాటి సీనియర్లను కాదని, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.

 కిచెన్ క్యాబినెట్లలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలిచిన అనుభవం కూడా లేదన్నారు.  ప్రజలతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎలాంటి సంబంధం లేని ఈ సరికొత్త నాయకులు కేవలం పగలు పైరవీలు, రాత్రికి డిన్నర్ పార్టీలకే పరిమితమవుతున్నారన్నారు ఇలాంటి వారి వల్ల ప్రజలకు,  నేతలకు మధ్య ఉండాల్సిన కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతోందని విశ్లేషించారు.

రాబిన్ శర్మ, ప్రశాంత్ కిశోర్, సునీల్ వంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీమ్‌లు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అపకారం చేస్తున్నాయన్నారు. వీరు  మ్యానుఫ్యాక్చర్డ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే కృత్రిమ ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియా, కంట్రోల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా లేని ప్రజాదరణను ఉన్నట్లు చూపిస్తున్నారనీ,  ఈ తప్పుడు నివేదికలను, గ్రాఫ్ లను  అధినేతలు మాత్రమే నమ్ముతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అసలైన ప్రజాభిప్రాయం వేరుగా ఉంటుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ దశలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్..  తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ,  తాను  2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు. దీనికి డోలేంద్రప్రసాద్..   రాజకీయాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ సంస్థల చేత సర్వేలు చేయించుకునే నేతలు..  నిజాయితీగా గ్రౌండ్ రియాలిటీ చెప్పే విశ్లేషకుల మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.  అధినేతలు ఇప్పటికైనా కృత్రిమ కోటరీలను పక్కన పెట్టి, ప్రజలతో మమేకమయ్యే నేతలను దగ్గరకు చేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర  నష్టాలు తప్పవని చెప్పారు. 

AP Politics, YS Jagan Coterie, Nara Lokesh Kitchen Cabinet, Political Analyst Dorendra Prasad, Teluguone MD Ravishankar, Telugu One News Political Debate