లోకేష్ భారీ ప్రకటన ఏమై ఉంటుంది?
Published on: Wed May 27, 2026 11:26AM

తెలుగుదేశం మహానాడు బుధవారం (మే 27) ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడు వేదికగా ఆయన తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ఓ భారీ ప్రకటన చేయనున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన వ్యాఖ్యతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు లోకేష్ ఏం ప్రకటన చేయనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. లోకేష్ పోస్టుపై నెటిజనులు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా జరగాలంటూ నెట్టింట లోకేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


