ఏం కొనాలి.. ఏం తినాలి.. ధరల పెరుగుదలపై చర్చలో కనిమోళి
Published on: Tue Aug 2, 2022 3:54PM
ధరల పెరుగుదలపై లోక్ధ సభ దద్దరిల్లింది. ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ సందర్భంగా మహిళా సభ్యులు వంటింట్లో బాంబు పేలినట్లుగా ఉందని ధరలపెరుగుదలను అభివర్ణించారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో మహిళా సభ్యులు గళమెత్తారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలపై వారి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మహిళగా ధరల పెరుగుదల వల్ల వంటింటి కష్టాలను వారు కళ్లకు కట్టినట్లు చెప్పారు. డీఎంకే సభ్యురాలు కనిమోళి అయితే ధరలిట్టా పెరుగుతుంటే ఏం కొనాలి, ఏం తినాలి అంటూ నిలదీశారు.
ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె టమాటా, ఉల్లిపాయల ధరలు తగ్గాయి కదా అని వ్యాఖ్యానించడంతో కనిమోళి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఆ రెంటితోనే మూడుపూటలా భోజనం చేయాలా అంటూ ప్రశ్నించారు.
అలాగే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మహిళా సభ్యురాలుకకోలి ఘోష్ గ్యాస్ ధరల పెంపును ప్రశ్నించారు. సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధరల బండ మోపుతున్నారని విమర్శించారు. సామాన్యులు గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయడానికే భయపడేంతగా ధరలు పెంచేశారని దుయ్యబట్టారు.
పచ్చి వంకాయను సభలో నోటితో కొరికి వంట చేసుకోవడమే పేదవారికి భారమయ్యేలా గ్యాస్ ధరలను పెంచేశారనీ, ఇక వారు పచ్చి కూరగాయలు తిని బతకాలా అని ప్రశ్నించారు.


