'మంద'కు వార్నింగ్ ఇస్తున్న మాలలు!
Published on: Sat May 5, 2012 12:33PM
వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందాకృష్ణమాదిగ చేపట్టిన తిరుగుబాటు యాత్రకు మాలల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మంద కృష్ణ మాదిగ తన యాత్రలో భాగంగా మాలలను విమర్శించటం, మాలలు తన ఉద్యమానికి వెన్నుపోటు పోడుస్తున్నారని ఆరోపించటంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇకపై మాలలను విమర్శిస్తే సహించేది లేదని మంద కృష్ణ మాదిగ చేసే యాత్రలపై వందలాది మంది మాలలు దాడులు జరుపుతారని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ హెచ్చరిస్తున్నారు.
మాలకులస్థులకు రావాల్సిన డిప్యూటీ సిఎం పదవిని మాదిగ కులానికి చెందిన దామోదర రాజనర్శింహకు ఇప్పించాతంలో కృష్ణమాదిగ పాత్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. వర్గీకరణ పేరుతొ రాజేకీయపార్టీల నుంచి కోట్లాది రూపాయలు దండుకోవడం మందకృష్ణమాదిగకు అలవాటేనని విమర్శిస్తున్నారు. చట్టబద్ధంగా చెల్లని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని భుజాన వేసుకుని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఉద్యమాలు చేస్తున్న మంద కృష్ణ మాదిగ దళితుల మధ్య చిచ్చుపేడుతున్నారని ఆరోపించారు. కృష్ణమాదిగ ఏం చేసినా దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాలమహానాడు పని చేస్తుందని ఆ సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మంద కృష్ణ మాదిగ తిరుగుబాటుయాత్రల సభల్లో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడుతున్నాయి. మాలలు ఏ క్షణాన్నయినా మందకృష్ణ మాదిగాపై దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.


