TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజయ్య చెపితే నో రెడ్డి గారు చెపితే యస్

Published on: Wed Sep 24, 2014 3:25PM

 

కొన్ని రోజుల క్రితం వరంగల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెడతామంటూ సాధ్యం కాని, అనవసరమయిన హామీలు ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్యకు అందరి ముందు చివాట్లు పెట్టారు. దళితుడయిన రాజయ్యపై కేసీఆర్ ఆవిధంగా దొరతనం ప్రదర్శించడాన్ని అందరూ తప్పు పట్టారు.


కానీ యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు, మరియు 22 మంది సభ్యులతో కూడిన తెలంగాణా కమిటీకి అధ్యక్షుడు అయిన డా. కే. సుధాకర్ రెడ్డి వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టవలసిన అవసరం ఎంతయినా ఉందని గట్టిగా వాదిస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో ఆ కమిటీ అనేక మార్లు సమావేశమయిన తరువాత వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ స్థాపనకు మార్గం సుగమం అవడంతో తెలంగాణా ప్రభుత్వం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదనలను గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.


యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ ఇప్పుడు ఆంధ్రాకు వెళ్ళిపోతుంది కనుక ఆ లోటును భర్తీ చేసేందుకు వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పాలని ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 600 ఎకరాల విస్తీర్ణంలో ఐదు మెడికల్ కాలేజీలున్నాయని, అందువల్ల అక్కడే హెల్త్ యూనివర్సిటీ కూడా నెలకొల్పినట్లయితే ప్రభుత్వం భూసేకరణకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని ఆయన సూచిస్తున్నారు. వరంగల్ పట్టణం రాజధాని హైదరాబాదుకు సమీపంగా ఉండటమే కాకుండా రైలు రోడ్డు మార్గాల ద్వారా కలపబడి ఉన్నందున వరంగల్ పట్టణం హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు అన్ని విధాల అనువయిందని ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నారు.


అయితే ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా హెల్త్ యూనివర్సిటీ పెడతామని చెప్పినందుకు రాజయ్యను నలుగురిలో అవమానించిన కేసీఆర్ ఇప్పుడు రాజ్య చెప్పినట్లుగానే వరంగల్లోనే హెల్త్ యూనివర్సిటీ ఎందుకు స్థాపిస్తున్నారో? ఇప్పుడు ఆయనకు ఏమని సమాధానం చెపుతారో మరి? రాజయ్య చెపితే ఒప్పుకొని కేసీఆర్, ఇప్పుడు డా. కే. సుధాకర్ రెడ్డి చెపితే ఎందుకు ఒప్పుకోన్నారో?