TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీకి వాకౌట్ ఫ్యాషన్ అయిపోయింది.. నారా లోకేష్

Published on: Fri Feb 13, 2026 11:52AM

ఆరోపణలు చేసి పారిపోవడం కాదనీ, చిత్తశుద్ధి ఉంటే సభకు వచ్చి చర్చించాలనీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీకి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్  శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జగన్ హయాంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలపై మాట్లాడిన లోకేష్.. జగన్ హయాంలో   రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆరోపణలు చేయడం పలాయనం చిత్తగించడం వైసీపీకి అలవాటుగా మారిందనీ, అలాగే వాకౌట్ చేయడం ఆ పార్టీకి ఫ్యాషన్ అయిపోయిందని లోకేష్ విమర్శించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాటతప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు.  దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. మండలిలో  వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారు. 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే.. ఎంటీఎఫ్ అరియర్లు  సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారని గణాంకాలతో సహా వివరించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేన్న లోకేష్ తాను రికార్డెడ్ గా చెబుతున్నాననీ,   విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు   హక్కు ఉందన్నారు.  దీనిపై బొత్స స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిలు లేవనీ, రెండు వాయిదాలు మాత్రమే బకాయి ఉందనీ  చెప్పి, ఇంటర్ విద్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించి అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.