పాయకారావుపేట కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికో?
Published on: Tue Apr 3, 2012 10:29AM
విశాఖజిల్లా పాయకరావుపేట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని నిలపాలనే విషయమై పార్టీ నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ స్థానంకోసం మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, ఇదే నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసి ఓటమిపాలైన అంబటి విజయారావు, గతంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేసిన తాతారావు టిక్కెట్ ను ఆశిస్తున్నారు. తాతారావు పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికాదు. రాజకీయాలకు కూడా ఆయన కొత్త. ఇదే తమకు కలిసి వస్తుందని ఆయన్ను బలపరుస్తున్న వర్గం చెబుతోంది. గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన గంటెల సుమనకు ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆమె వర్గానికి చెందిన అభిమానులు వాదిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గంటెల సుమన పేరునే అధిష్టానం ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.


