వీడని విషాదం.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టైరిన్ గ్యాస్ కు మరో ప్రాణం బలయింది. గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. గతంలో 12 మంది మరణించగా, కొద్దిరోజుల క్రితం ఒక వృద్ధ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో కనకరాజు మృతి చెందడంతో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, సోమవారం(నిన్న) తీవ్ర అస్వస్థతకు గురవడంతో కనకరాజు మృతి చెందాడు. కాగా, ఎల్జీ పాలిమర్స్ వల్లనే మృతి చెందాడని కనకరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స అందిన కొన్నిరోజులకి కూడా ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమయంలో అస్వస్థకు గురైన వందలాది మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.