టెస్టుల్లో విరాట్ ఆరో డబుల్ సెంచరీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భీకర ఫాంని కొనసాగిస్తున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న టెస్టులో విరాట్ డబుల్ సెంచరీ బాదాడు. ఇది ఆయన కెరీర్‌లో ఆరోవది. లక్మల్ వేసిన ఇన్నింగ్స్‌ 107.6వ బంతికి రెండు పరుగులు తీసి కెరీర్‌లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 2016కు ముందు కోహ్లీ పేరిట ఒక్క డబుల్ సెంచరీ కూడా లేదు. అయితే ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదేసి.. తాజాగా ఫిరోజ్ షా కోట్లాలో మూడో ద్విశతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా కెప్టెన్‌గా ఆరు డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్లలో సచిన్, సెహ్వాగ్ ఆరు సార్లు ద్విశతకాలను సాధించారు.