అనంతపురంలో దారుణం.. మైనర్ బాలికపై వైసీపీ నేత దాడి!

 

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్థులంతా చూస్తుండగానే.. ఆ ఊరి పెద్ద దళిత మైనర్ అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దళిత యువతీయువకులు వన్నూరమ్మ, బాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరు పెద్దలకు భయపడి.. పెళ్లి చేసుకోవాలని భావించి మూడు రోజుల క్రితం ఊరి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కనిపెట్టి తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఎస్సీ కాలనీ వద్ద ఉన్న రచ్చబండ వేదికగా గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. వరసకు అన్నాచెల్లెళ్లవుతారని.. ఇరువురి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
 
గ్రామానికి చెందిన వైసీపీ నేత లింగప్ప, మాజీ ఎంపీటీసీ బ్రహ్మానందరెడ్డిని కూడా ఈ పంచాయితీకి పిలిచారు. మైనర్‌ అయిన వన్నూరమ్మ మాత్రం బాబునే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహించిన లింగప్ప తొలుత వన్నూరమ్మ చెంపలపై చేతితో తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. విచక్షణారహితంగా కర్రతో బాదాడు. కాలితో గుండెలపై తన్నాడు.  ప్రేమించుకున్నారనే కారణంతో ఇద్దరు మైనర్లను గ్రామస్థుల ముందే గ్రామ పెద్దలు తీవ్రంగా కొట్టారు. కాగా, యువతిని చితకబాదుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గ్రామానికి వెళ్లి ఘటనపై విచారణ చేస్తున్నారు.