TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయికృష్ణ కాళ్లపై మేకులు కొట్టి సీఐ నాగరాజు చంపాడు : తల్లి

Published on: Sat Jul 4, 2026 6:30PM

 

కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా....!

గాదె సాయికృష్ణ లాక్‌అప్ డెత్ కేసులో ఆయన తల్లి తీవ్ర ఆవేదనతో సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని అమానుషంగా హింసించి, మేకులు కొట్టి దారుణంగా చంపారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు."నా కొడుకును ఎంత చిత్రహింసలకు గురి చేశారో ఆలోచిస్తే గుండె పగిలిపోతోంది. మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. కనీసం నా కొడుకు బూడిదైనా మాకు అప్పగించండి. లేకపోతే పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుంటా" అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, అయితే తన కుమారుడిపై దాడి చేసి హింసించిన మరికొందరు ఇంకా బయటే తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఉన్నత స్థాయి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపైనా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును నిష్పాక్షికంగా విచారించి, ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, దర్యాప్తు అధికారులను కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

"పోలీస్ స్టేషన్ పైన లభించిన బూడిద, ఎముకల ముక్కలు నా కుమారుడివేనని గ్యారెంటీ ఏంటి? ఖాకీల అండతో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగాయో ఎవరికి తెలుసు?" అంటూ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కనీసం తన కొడుకు అస్తికలనైనా తనకు అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటానని, లేనిపక్షంలో తాను కూడా ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారడంపై స్థానికంగా మరియు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యుడైన సీఐతో పాటు ఈ ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపాలని మానవ హక్కుల సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ కేసు మెజిస్టీరియల్ విచారణ పరిధిలో ఉండటంతో.. ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, ఖాకీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజా సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.