వైఎస్ షర్మిల ఫిర్యాదు..విజయశాంతి రియాక్షన్

 

సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. వీరి వెనుక టీడీపీ నేతలున్నారని..వైఎస్ షర్మిల హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా షర్మిల ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విజయశాంతి మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయని ఆమె చెప్పారు. ఈ పరిస్ధితిని అధిగమించడం కోసం, పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.