రగిలిపోతున్నరాములమ్మ..
Published on: Fri Aug 19, 2022 10:39AM
కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సేవలను ఉపయోగించుకోవడం లేదని ఆమె అసహనంగా ఉన్నారు.
ఏదైనా బాధ్యతలు అప్పగించి పని చేయమంటే చేస్తాం కానీ ఏ బాధ్యతలూ ఇవ్వకుండా పని చేయడం లేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తాను అసంతృప్తి గా ఉన్నానో,లేదో పార్టీ నాయకులనే అడగాలన్న విజయశాంతి ఉద్యమకారిణిగా ప్రజల గుండెలలో తనకు సుస్థిర స్థానం ఉందని దాన్ని ఎవరు తీయలేరని చెప్పారు. పార్టీలో తన పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్ళని పాతరేస్తే మంచిదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడిన విజయశాంతి ఆ తరువాత తన పార్టీని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో విలీనం చేశారు. కేసీఆర్ చెల్లిగా మారి.. టీఆర్ఎస్ లో నంబర్2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమెను కేసీఆర్ ఎంపీని చేసి ఢిల్లీకి కూడా పంపించారు.
అయితే కేసీఆర్ తో విభేదాలతో రాములమ్మ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. తొలి నాళ్లలో విజయశాంతికి కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యతే దక్కింది. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు సైతం అప్పగించారు. ఆమె కోరినట్లుగానే మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ ఇచ్చింది.
అయితే ఆ ఎన్నికలలో విజయశాంతి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందంటూ అలిగిన విజయశాంతి తదననంతరం కమలం గూటికి చేరారు. బీజేపీలో కూడా తొలి నాళ్లలో విజయశాంతికి మంచి ప్రాధాన్యతే లభించింది. ఆ తరువాత తరువాత అంటే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ అయిన తరువాత విజయశాంతికి ప్రాధాన్యత ఒకింత తగ్గిందనే చెప్పాలి. తెలంగాణలో అధికారం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. అందుకు అనుగుణంగా వరుస కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.
ఈనేపథ్యలోనే పార్టీలో విజయశాంతికి గళమెత్తే అవకాశం రావడం లేదు. బీజేపీ తన సేవలను ఉపయోగించుకోవడం లేదనీ, తనను నిశబ్దంలో ఉంచేస్తోందని రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తాజాగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా సర్వాయి పాపన్న జయంతిలో కనీసం మాట్లాడే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి భగ్గుమనడం ఆమె రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉంటుందా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది,


