TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైట్ ఫ్లాగ్ తో విజయ్ సాయి.. రెడ్ బుక్ తో లోకేష్...

Published on: Tue Jan 28, 2025 10:50AM

నిన్నటి దాకా ఏ ఎక్స్ వేదికగానైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారో..ఇప్పుడు అదే ఎక్స్ వేదికగా వారిపై పొగడ్తల వర్షం కురిపించి దగ్గరకావలని ప్రయత్నిస్తున్నారు విజయసాయి రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇక ఇప్పుడు తన లాయలిటీని జగన్ నుంచి పూర్తిగా కూటమి పార్టీలవైపు మార్చేసుకున్నట్లు కనిపిస్తున్నది.

తన రాజీనామా ప్రకటన సందర్భంగా   తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ల పట్ల తనకు మంచి అభిప్రాయముందనీ, రాజకీయంగా విభేదించానే తప్ప ఇరువురితోనూ తనకు మంచి సంబంధాలున్నాయనీ పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఆ తరువాత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంపై ప్రశంసల వర్షం కురిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్  ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని ప్రశంసలు గుప్పించారు. ఇంకా పురాతన కళానైపుణ్యం, సంప్రదాయం,  స్థిరత్వాల పరిపూర్ణ సమ్మేళనంగా శకటాన్ని తీర్చి దిద్దారని పేర్కొన్నారు.  

కేసులు, అరెస్టు భయం, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు, మద్యం కుభకోణం విషయాలలో పీకల్లోతు మునిగి ఉన్న విజయసాయి.. ఎలాగైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గుడ్ లుక్స్ లో పడాలన్నప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అవకాశం దొరికినా దొరక్కపోయినా, సందర్భం ఉన్నా లేకున్నా పొగడ్తల వర్షంలో ముంచెత్తి ఆకాశానికెత్తేసి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారంటున్నారు.  

అయితే విజయసాయి గిమ్మిక్కులు తెలుగుదేశం, జనసేనలను ఇసుమంతైనా ప్రభావితం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  నుంచి కూటమి నేతలందరూ కూడా విజయసాయి తన అక్రమాలు, అరాచకాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలనీ, దోషులకు శిక్ష పడాలని అంటున్నారు.  మొత్తం మీద విజయసాయి తన సమయాన్నంతా వైసీపీ వ్యతిరేక పార్టీల నేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకే వెచ్చిస్తున్నారనీ, ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చౌకబారు ట్రిక్స్ లా కనిపిస్తున్నాయనీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.