ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని చార్మినార్‌ను కూల్చాలంటే! 

పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయశాంతి. అక్భరుద్దీన్ ఒవైసీకి, ఎంఐఎం నేతలకు ఆమె చురకలంటించారు. అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని అనవచ్చని విజయశాంతి ట్వీట్ చేశారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్‌ను కూల్చాలని కూడా అనవచ్చని ఆమె అన్నారు. ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల.. స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నానని విజయశాంతి చురకలంటించారు.