మమతా బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా ఫోన్లకు దొరకని చంద్రబాబు!!

 

టీడీపీ నేత నారా లోకేష్, వైసీపీ నేత విజయసాయి రెడ్డి నడుమ ట్విట్టర్ వార్ నడుస్తుంది. 'సీక్రెట్ గా చిత్రీకరించిన వైసీపీ భాగోతం' పేరుతో.. విజయ సాయి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను నిన్న లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. "నాలుగు లక్షల మంది వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైసీపీ వాలంటీర్ల స్కీం." అని లోకేష్ విమర్శించారు.

కాగా, లోకేష్ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. "మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?" అని ఎద్దేవా చేసారు.

ఎన్నికల సమయంలో మోడీకి వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వడంపై కూడా విజయ సాయి విమర్శలు చేసారు. "మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట." అని ట్వీట్ లో పేర్కొన్నారు.