ఏపీలోని ప్రతి మహిళ సమాచారం వారి వద్ద ఉంది

 

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంబంధించిన సమాచారం టీడీపీ వద్ద ఉందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారాన్ని చంద్రబాబు దొంగిలించారని మండిపడ్డారు. ఆ సమాచారం టీడీపీ గూండాల వద్ద కూడా ఉందని అన్నారు. మహిళల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలు చంద్రబాబు ముఠా దగ్గర ఉన్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2016 లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆరోపించారు. ఆధార్ నమోదులో ఎంతో కీలకంగా భావించే ఫింగర్ ప్రింట్స్, రెటీనా స్కాన్ వంటి ఇ-డేటాను ఇ-ప్రగతి పోర్టల్ కు బదిలీ చేసుకుని, దాని క్యారక్టరైజేషన్ ను ఓ సాఫ్ట్ వేర్ ద్వారా డేటా రూపంలోకి మార్చుకున్నారని విజయసాయి ఆరోపించారు. ఆ విధంగా ఇ-ప్రగతిలోకి ఆధార్ డేటాను రాబట్టిన చంద్రబాబు దొంగలముఠా అక్కడ్నించి పార్టీ యాప్ సేవామిత్రలోకి దాన్ని బదలాయించిందని ఆరోపించారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని అన్నారు.

ఈ సేవామిత్రను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ అని, ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ దాకవరంను పట్టుకునేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికీ ప్రయత్నిస్తోందని తెలిపారు. "సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్‌-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతున్నారు. అశోక్‌ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?." అని ప్రశ్నించారు. అశోక్‌ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలని విజయసాయిరెడ్డి తెలిపారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్‌సైట్‌లోనే నాయకులను ఆదేశించింది.

మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా, మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల నంబర్ల ద్వారా సేవామిత్ర ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేయగలదని అన్నారు. ఫోన్ లో ఉన్న మైక్ ను కూడా తమ అదుపులోకి తీసుకుని ఇతరుల సంభాషణను రికార్డు చేసే వీలుందని వివరించారు. ఈ విధంగా చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ అశోక్ తో కలిసి దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చాడో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కొత్త నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే అది చంద్రబాబు ముఠా దొంగిలించిన సమాచారం ఆధారంగా జరిగే మోసంగా అందరూ భావించాల్సిన పరిస్థితి ఉందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.