కాకినాడలో విజయ్‌దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం

 

వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల లడక్‌లో షెడ్యూల్‌ పూర్తి కావడంతో కాకినాడలో  ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండకు జోడీగా  రష్మికా మండన్నా నటిస్తోంది. కాగా కాకినాడలో జరుగుతున్న షూటింగ్‌లో విజయ్‌దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షూటింగ్‌లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్‌ పట్టుతప్పి కిందపడిపోబోయారు. అనంతరం తిరిగి పట్టుచిక్కి ట్రైన్‌ ఎక్కారు. ఈ ఘటనలో విజయ్‌కి చిన్న గాయమే అయినా, ఒకవేళ పట్టుతప్పి పడిపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలుస్తోంది. చిత్ర షూటింగ్‌ జరుగుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా, షూటింగ్‌లో గాయపడిన విజయ్‌  జీవితంలో ఏదీ ఊరికే రాదు.. గాయాలతో కూడా పండగ చేసుకోవాలి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టారు.