TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ వర్సిటీ బంపర్ ఆఫర్

Published on: Sun May 17, 2026 12:04PM

 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో ఘన అభినందన సభ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ .. వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 600కు పైగా మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీట్లు కల్పించి పూర్తి విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

 ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు పిల్లల చదువును మధ్యలో ఆపేయకుండా ధైర్యంగా పై చదువులకు పంపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. అందులో 287 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని ఎంపీ కొనియాడారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కూడా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కనీసం డిగ్రీ వరకు చదివించాలి

ఎస్టీ కుటుంబాల నుంచి ప్రతి గ్రామంలో కనీసం నలుగురు విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకోవాలని తమ ఆకాంక్ష అని ఎంపీ పేర్కొన్నారు. వారిని చూసి మరికొందరు విద్యార్థులు కూడా స్ఫూర్తి పొంది చదువులో ముందుకు వస్తారని అన్నారు. కనీసం డిగ్రీ వరకు చదివితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మరింత సులభమవుతాయని, అందుకే తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఇదే కార్యక్రమంలో నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ .. నరసరావుపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.