TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంకయ్యకే మళ్ళీ.. నాగపూర్ ఆదేశం ?

Published on: Wed Jul 13, 2022 3:20PM

రాష్ట్రపతి ఎన్నికల సందడి చివరాఖరు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో అంటే జులై 18 పోలింగ్ జరుగుతుంది. 21 న కౌంటింగ్, 25 న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఇక  అక్కడితో నెల రోజులకు పైగా రాష్ట్రపతి  ఎన్నికల  చుట్టూ సాగుతున్న రాజకీయ సందడి సర్డుమణుగుతుంది. అయితే ఆ వెంటనే, నిజానికి ఇంకా ముందుగానే, ఉప రాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం 2022, ఆగస్టు 10 వతేదీతో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదల చేసిన న్నికల షెడ్యూలు ప్రకారం, జూలై 5 న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజున మొదలైన నామినేషన్ల గడువు, జూలై 19 తో ముస్తుంది.

అవసరమైతే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  అయితే, ఇంత వరకు అధికార, విపక్ష పార్టీలు/ కూటములు అభ్యర్ధుల ఎంపికపై, అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. నిజానికి, రాష్ట్ర పతి ఎన్నికలలో విపక్షాలకు, అంతా కలిసి, పోటీ చేస్తే గెలిచే అవకాశం, ఆశ ఓ చిగురంత అయినా వుంది. కానీ, ఉపరాష్ట్ర పతి ఎన్నికలలో చిగురంత కాదు, కనీసం చీమ తలంత చిరు అవకాశం, చిన్ని ఆశకు కూడా అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో పాటుగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులకు కూడా,ఓటు హక్కు ఉంటుంది. కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో, ఎమ్మెల్యేలకు ఓటుహక్కు ఉండదు, కేవలం, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు మాత్రమే ఓటు హాక్కు ఉంటుంది. 

పార్లమెంట్ ఉభయ సభల్లో  బీజేపీ/ ఎన్డీఎ కూటమికి సంపూర్ణ ఆధిక్యత వుంది. పార్లమెంటు ఉభయ సభల ప్రస్తుత బలం 780 కాగా.. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసేందుకు  390 మంది ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ఒక్క బీజేపీకే పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 394 మంది ఏంపీలున్నారు. ఎన్డీఎ బలం 390(ఎల్ఎస్) ప్లస్ 144 (ఆర్ ఎస్) మొత్తం 534 వరకు  వుంది. ఎన్డీఎకి మద్దతు ఇస్తున్న వైసీపే, (22)  శివసేన చీలిక వర్గం (14) బీజేడీ ఇతర పార్టీల సఖ్యాబలన్ని కలుపుకుంటే మొత్తం 780 ఎంపీలలో ఎన్డీఎ అభ్యర్ధికి ఇంచుమించుగా 600 మంది మద్దతు లభించే అవకాశం వుంది.

అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎదురైనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, రాజ్య సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించింది.  అంతే కాకుండా బలబాలతో సంబంధం లేకుండా, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. అదలా ఉంటే బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి విషయంలో ప్రస్తుతాని సస్పెన్స్ కొనసాగుతోంది.  అయితే మొదటి నుంచి కూడా  మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అందుకే  ఆయన్ని రాజ్య సభకు తిరిగి నామినేట్ చేయలేదని ప్రచారం జరిగింది. కాగా, ఆయన రాజ్యసభ పదవీ  కాలం జులై  10 తేదీతో ముగిసింది. అందుకు ఒక రోజు ముందే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, తాజగా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడినే మరో మారు కొనసాగించాలని, పార్టీ  హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో , బీజేపీ కోర్ ఐడియాలజీకి సంబందించిన కీలక బిల్లులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో, ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా ఉండడం అవసరమని, హై కమాండ్ అలోచిస్తునట్లు తెలుస్తోంది.

అయితే వెంకయ్య నాయుడు నో’ అనే పక్షంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ తో పాటుగా కేంద్ర మాజీ మంత్రులు సురేశ్‌ ప్రభు, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌ పురీ, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు వెంకయ్య నాయుడిని ఒప్పించే ప్రయత్నం గట్టిగా సాగుతోందని తెలుస్తోంది. కాగా, ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు సమాచారం. బోర్డులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉన్నారు.