అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
posted on Jul 4, 2020 12:06PM
మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన అల్లూరి తెగువ, దేశభక్తిలను స్మరించారు. నేటి యువత ఆయన ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
"భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో.. తెలుగు నాట ఆంగ్లేయులను గడగడలాడించిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ యోధుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. శత్రువు బలమైన వాడని తెలిసినా.. తనవద్ద పరిమితమైన వనరులే ఉన్నా.. అచంచల ఆత్మవిశ్వాసం, గుండెలనిండా దేశభక్తితో రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమని చెప్పుకునే ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి ధైర్యసాహసాలు.. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచాలన్న ఉక్కుసంకల్పం స్ఫూర్తిదాయకం." అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.