రుణమాఫీపై కేంద్రం హామీ ఇవ్వలేదు..!

 

రుణమాఫీపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై రెండు రాష్ర్ట ప్రభుత్వాలు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రుణమాఫీపై తెలంగాణకు కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వదన్న ఆయన ఇతర రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణకు కూడా కేంద్రం సహాయం ఉంటుందన్నారు. మరోవైపు ఏపీ రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, పలువురు బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.