వైసీపీకి బిగ్ షాక్.. వంగవీటి రాధా రాజీనామా!!

 

వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఆదివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా.. రాధా వైసీపీ వీడేందుకు సిద్ధమయ్యారన్న సమాచరంతో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న రాధాతో చర్చలు జరిపి బుజ్జగించారు. అయినా రాధా శాంతించలేదు. పార్టీ మారొద్దని అధిష్టానం టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని బొత్స సత్యనారాయణ సుమారు అరగంటకు పైగా రాయభారం నడిపారు. అయితే ఈ భేటీ అయిన అరగంటకే రాధా రాజీనామా చేయడం గమనార్హం.

వంగవీటి రాధా గత కొన్నిరోజులుగా టికెట్ విషయంలో అధిష్టానంపై అలకబూనారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలని ఆయన కోరగా.. కుదరదని జగన్ నిరాకరించారు. విజయవాడ తూర్పునుంచి పోటీ చేయాలని లేదా మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయాలనీ రాధాను అధిష్ఠానం ఆదేశించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆఖరికి జగన్ పాదయాత్ర ముగింపునకు ఇచ్ఛాపురంకు కూడా వెళ్లలేదు. దీంతో ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకుంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం రాధా వైసీపీకి రాజీనామా చేసారు. ఏ పార్టీలో చేరేది ఆయన ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయన జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారని సమాచారం.