గన్నవరం నుండి వల్లభనేని వంశీ పోటీ..!
posted on Mar 25, 2013 11:01AM
లోక్సభ ఎన్నికలలో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఖరారు చేసేముందు చంద్రబాబు నాయుడు గారు.. తొలుత వల్లభనేని వంశీమోహన్ను బస్సులోకి పిలిపించి గంటసేపు మాట్లాడారు. అర్బన్ బాధ్యతలు వదిలేసి, రాష్ట్ర కమిటీలోకి రావాలని వంశీని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలలో వంశీ పోటీచేయడానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం సీటుకోసం పట్టుపట్టారు. దాసరి జైరమేష్, బాలవర్ధనరావులను వదులుకోలేని చంద్రబాబు..అప్పట్లో వంశీకి నచ్చచెప్పారు. తనమాట విని ఈసారికి విజయవాడ నుంచి పోటీ చేయాలని, వచ్చేసారి (2014) గన్నవరంలో పోటీకి పెడతానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. భేటీ సందర్భంగా ఈ హామీని వంశీ గుర్తుచేసినట్టు తెలుస్తోంది. 'గన్నవరం' వంశీకి ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును మండలికి పంపడమో లేక విజయా డైరీ మిల్క్ సొసైటీ చైర్మన్ని చేయడమో చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే దాసరి, జైరమేష్లతో బాబు మాట్లాడిన తరువాతగానీ దీనిపై స్పష్టత రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వంశీకి గన్నవరం సీటు ఇచ్చేసినట్టు టీవీలలో స్క్రోలింగ్లు వచ్చాయి. దాంతో ఎమ్మెల్యే దాసరి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.