TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంశీ ఇలా కనిపించారు.. అలా మాయమయ్యారు!

Published on: Thu Sep 25, 2025 3:35PM

వైసీసీ అధికారంలో ఉన్నంత కాలం.. అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు,  ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాటల దాడి చేసిన వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మౌనం వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం టికెట్ పై ఎన్నికలలో విజయం సాధించి.. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో  జగన్ పార్టీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం సహా.. తెలుగుదేశం కార్యకర్తలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు.

అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లుగా అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిన వంశీ పరిస్థితి ఆ తరువాత దయనీయంగా మారింది. 2024 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా వంశీ స్వయంగా గన్నవరంలో ఓడిపోయారు. గతంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దాడులతో కేసులలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. విజయవాడ జిల్లా జైలులో నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తరువాత బెయిలుపై విడుదలైనా క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా భావించారు.  అయితే హఠాత్తుగా వంశీ బుధవారం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులతో భేటీ అయ్యారు.  అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా ఆయన భేటీ సాగింది. మొత్తం మీద వంశీ నియోజకవర్గంలో కొందరు వైసీపీయులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి జగన్ వంశీని పీకేస్తారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆయన బయటకు రావడంతో మళ్లీ పోలిటికల్ గా వంశీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే నియోజకవర్గ పార్టీ నేతలు మాత్రం వంశీకి మద్దతుగా నిలిచే ప్రశక్తే లేదని అంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చూడాలి మరి వంశీ ముందు ముందు ఏ నిర్ణయం తీసుకుంటారో?