TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచిన్ రికార్డ్ బ్రేక్ చేయనున్న వైభవ్ సూర్యవంశీ

Published on: Tue Apr 14, 2026 3:22PM

 

తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు. ఈ యువ చిచ్చర పిడుగు దూకుడుగా ఆడుతూ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. 15 ఏళ్ల ఈ కుర్రాడిని సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు ఇతర యువ ఆటగాళ్లతో పాటు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో సూర్యవంశీకి కూడా చోటు దక్కినట్లు సమాచారం. 

అదే జరిగితే.. భారత్‌ తరఫున జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పటివరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(16 ఏళ్లు) పేరిట ఉంది. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో నిన్న హైదరాబాద్‌పై తప్ప.. మిగతా నాలుగు మ్యాచుల్లోను దూకుడుగా ఆడేశాడు.

ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షార్ట్‌లిస్ట్‌లో వైభవ్‌కు చోటు దక్కినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.  ఐర్లాండ్‌ పర్యటనలో చక్కటి ప్రదర్శన చేస్తే.. జింబాబ్వేతో సిరీస్‌కూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన టెండూల్కర్, భారత పురుషుల జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా అయితే ఈ రికార్డు షఫాలీ వర్మ పేరిట ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రోజుల వయస్సులో భారత మహిళల జట్టులోకి అరంగేట్రం చేసింది