మరో లోక్‌సభ ఎన్నిక ఓడిపోనున్న బీజేపీ

 

బీజేపీ మరో లోక్‌సభ ఎన్నికని ఓడిపోనుందా అంటే కాదని చెప్పడం మాత్రం అంత తేలికగా కనిపించడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానానికి ఈ నెల 28 న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ సిట్టింగ్‌ ఎంపీ బీజేపీకి హుకుం సింగ్ మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. సహజంగానే బీజేపీ సానుభూతి ఓట్ల కోసం హుకుంసింగ్‌ కూతురుని అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఆ సానుభూతి ఎంతవరకు పనిచేస్తుందని చెప్పడం కష్టమే! ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్‌పీ, బీఎస్‌పీ పార్టీలు ఒక్క తాటి మీద నిలబడటం ఒక ఎత్తయితే, కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్‌ కూడా వారితో చేరి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేయడం మరో ఎత్తు. విపక్షాలన్నీ ఒకటైన సందర్భంలో కైరానా స్థానాన్ని బీజేపీ చేజార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇది బీజేపీకి వరుసగా మూడో ఉప ఎన్నిక ఓటమిగా మిగిలిపోతుంది.