రూటు మార్చిన ట్రంప్.. భారత్ ఎంతో రోత.. కారణం అదేనా...

నిన్నటి వరకు భారత్ అన్నా.. మోడీ అన్నా.. ఎంతో ఇష్టమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారత్ అంటే రోత అన్నట్లుగా మాట్లాడాడు. తాజాగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా.. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్‌తో నాష్‌విల్లేలో గురువారం రాత్రి జరిగిన జరిగిన చివరి డిబేట్ లో ట్రంప్‌ భారత్‌ను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. "భారత్‌ను చూడండి.. అక్కడ పీల్చేగాలి కూడా రోత పుట్టిస్తుంది. భారతే కాదు.. చైనా, రష్యా దేశాలు కూడా వాయుకాలుష్యమయమే.." అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మూడు దేశాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణస్థాయిలకు పడిపోయిందని అన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఆ మూడు దేశాలు సహకరించడం లేదని ఆరోపించారు. అందుకే పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఆ మూడు దేశాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రంప్ అన్నారు.

 

ఇది ఇలా ఉండగా భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ చేసిన విమర్శలపై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన "హౌడీ.. మోడీ" కార్యక్రమాన్ని పలు సందర్భాల్లో ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. మోదీ తనకు ఆప్తమిత్రుడంటూ ఆకాశానికి ఎత్తేసిన విషయాన్నీ పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అయితే ట్రంప్‌ ఒక్కసారిగా ఇలా రూటు మార్చి భారత్‌పై విరుచుకుపడటానికి కారణం... వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న భారతీయుల ఓట్లపై ట్రంప్‌, బైడెన్‌ కన్నేశారు. అయితే ఇటీవల జరిగిన సర్వేల్లో అనూహ్యంగా బైడెన్‌కే భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడి కావడంతో ట్రంప్‌ తన అక్కసునంతా ఈవిధంగా వెళ్లగక్కారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.