సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు

దేశంలో అత్యున్నత సర్వీస్ గా పేరుగాంచిన యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో తెలుగు యువత విశేష ప్రతిభను కనపరిచారు. 50కి పైగా ర్యాంకులు సాధించి సివిల్ సర్వీస్ లకు ఎంపికయ్యారు. ఐఎఎస్, ఐపీఎస్‌, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్స్ 2019 ఫలితాలను యూపీఎస్ సీ విడుదల చేసింది. 829మంది అభ్యర్థులు అర్హత సాధించగా అందులో 50మంది తెలుగువారే కావడం విశేషం. 829మందిలో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ పరీక్షల్లో  జాతీయస్థాయిలో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు.

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ప్రతిఏడు మాదిరిగానే తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డి 46వ ర్యాంకు సాధించి జాబితాలో టాప్-50లో నిలిచారు. ఆమె ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నారు. ర్యాంకులు సాధించిన వారిలో మల్లవరపు సూర్యతేజ(76), కట్టా రవితేజ(77), సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి(95), ఎంవీ సత్యసాయి కార్తీక్(103), మంద మకరంద్(110), తాటిమాకుల రాహుల్ రెడ్డి(117), కె.ప్రేమ్ సాగర్(170), పిన్నాని సందీప్ వర్మ(244), శ్రీచైతన్య కుమార్ రెడ్డి(250), చీమల శివగోపాల్ రెడ్డి(263), యలవర్తి మోహన్ కృష్ణ(283), ఎ.వెంకటేశ్వర్ రెడ్డి(314), సిరిశెట్టి సంకీర్త్(330), ముత్తినేని సాయితేజ(344), ముక్కెర లక్ష్మీపావన గాయత్రి(427), కొల్లాబత్తుల కార్తీక్(428), ఎన్.వివేక్ రెడ్డి(485), నీతిపూడి రష్మితారావు(534), కోరుకొండ సిద్ధార్థ(566), సి.సమీర్ రాజా(603), కొప్పిశెట్టి కిరణ్మయి(633)తదితరులు ఉన్నారు.