యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధింపుకు లోక్‌సభ ఆమోదం..!

posted on: Aug 6, 2026 5:52PM

 

దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ  డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు సవరణలు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రత్యక్ష పన్నులు, సంబంధిత చట్టాల సవరణ బిల్లుకు దిగువ సభలో ఆమోదం లభించింది. ఈ చట్టసవరణ ద్వారా నిర్దిష్ట డిజిటల్ లావాదేవీల ఉచిత వినియోగ నిబంధనను తొలగించారు.

గతంలో ఉన్న చట్ట ప్రకారం డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధన ఉండేది. తాజాగా తీసుకొచ్చిన మార్పుతో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ఎంపిక చేసిన డిజిటల్ పేమెంట్ విధానాలపై ఛార్జీలు విధిచేందుకు బ్యాంకులకు, చెల్లింపు సంస్థలకు వీలు కలుగుతుంది. డిజిటల్ చెల్లింపులకు అవసరమైన భారీ సాంకేతిక నిధులు, సైబర్ భద్రత ప్రాసెస్ నిర్వహణ వ్యయాన్ని భరించేందుకు ప్రాఫిట్ మోడల్ అవసరమని బ్యాంకింగ్ వర్గాలు, ఫిన్‌టెక్ రంగాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మౌలిక వసతుల నిర్వహణ కోసం ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే సాధారణ పౌరులు రోజువారీగా జరిపే చిన్న చిన్న లావాదేవీలు లేదా ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తగత (P2P) ట్రాన్సాక్షన్లపై తక్షణమే ఎటువంటి భారం పడదని తెలుస్తోంది. కేవలం పెద్ద వ్యాపార సంస్థలు, అధిక మొత్తంలో జరిగే నోటిఫైడ్ వ్యాపార లావాదేవీలకే ఇవి వర్తించే అవకాశముంది. ఈ పరిణామంపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. పేమెంట్ ఆపరేటర్లకు ఇది ఊరటనిచ్చే విషయమైనప్పటికీ, సాధారణ వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపు మళ్లకుండా ఉండేలా ప్రభుత్వ నిబంధనలుండాలని పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి రాబోయే అధికారిక నోటిఫికేషన్ ద్వారానే ఏ రకమైన డిజిటల్ చెల్లింపులకు, ఎంత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.

UPI Charges, Lok Sabha Bill, MDR Charges Digital Payments, Payment and Settlement Systems Act, Indian Economy News Telugu
 

google-ad-img
    Related Sigment News
    • Loading...