బస్సు చూడండి కానీ ముట్టుకోవద్దు.. అఖిలేష్ యాదవ్‌

 

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ ‘వికాసయాత్ర’ పేరిట గురువారం నుంచి ఈ యాత్రను ప్రారంభిచనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రకు గాను అఖిలేష్ యాదవ్ ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసుకున్నారు. పది చక్రాల ఎర్రటి మెర్సిడెస్‌ బస్సును సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సు మంగళవారం అఖిలేష్ అధికారిక నివాసానికి చేరుకుంది. వికాస యాత్ర పేరుతో సాగే ఈ ప్రచారయాత్రలో కొద్దిరోజుల పాటు ఇదే బస్సులో ఆయన బస చేయనున్నారు. మంగళవారం లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చిన ఈ బస్సును వీక్షించేందుకు మీడియా, ప్రజలు ఎగబడ్డారు. అయితే బస్సును చూస్తున్నప్పుడు మీడియా ఫొటోలు తీస్తుండగా.. ‘బస్సు చూడండి కానీ ముట్టుకోవద్దు’ అని అఖిలేష్ అన్నారట. అంతేకాదు అఖిలేష్‌ నిలబడి ప్రచారం చేయడానికి వీలుగా బస్సులో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. బస్సు చుట్టూ సీసీటీవీ కెమెరాలు, లోపల ఎల్‌సీడీ టీవీలు, సోఫాలు, బెడ్‌ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. కాగా గత కొద్ది రోజుల నుండి అఖిలేష్ కుటుంబంలో విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలసిందే.