తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత ఎండమావే!
Published on: Sun Jul 3, 2022 6:11AM
తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావిలాగే తయారైంది. అన్ని వర్గాలూ గ్రూపు విభేదాలు మరచి కలిసి పని చేస్తున్నట్లు కనిపించినా.. వేటికవి గానే కాలుదువ్వుతుంటాయి. తాజాగా కాంగ్రెస్ లో విభేదాల తుట్టె కదిలింది. అందుకు రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి య శ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక కారణమైంది. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోయినా.. ఆయన ముందుగా టీఆర్ఎస్ ఎంపీలను కలవడం, ఆ తరువాత తమను కలుస్తాననడం కాంగ్రెస్ కు రుచించలేదు.
అందుకే కేసీఆర్ ఆధ్వర్యంలో యశ్వంత్ సిన్హాతో ఏర్పాటు చేసిన భేటీకి, అలాగే ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేశామన్నారు. ఒకటి రెండు రోజుల తరువాత హస్తినలో యశ్వంత్ సిన్హాను కలిసి మద్దతు తెలుపుతామని రేవంత్ చెప్పారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాను కలవడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అందులోనూ కేసీఆర్ సమక్షంలోనే వీహెచ్ యశ్వంత్ సిన్హాకు బొకే ఇచ్చి అభినందనలు తెలపడం పుండుమీద కారం చల్లినట్లైంది. దీనిపై రేవంత్ ఫైర్ అయ్యారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదనీ గోడకేసి కొడతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా యశ్వంత్ సిన్హాను పార్టీ తరఫున ఎవరూ కలవలేదనీ, వ్యక్తిగతంగా ఎవరైనా కలిసి ఉంటే అది తమకు సంబంధం లేదని రేవంత్ అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వీహెచ్ పై రేవంత్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడానికి రేవంత్ ఎవరంటూ రెచ్చిపోయారు. గోడకేసి కొడతామన్న వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకుని కాంగ్రెస్ కు, వీహెచ్ కు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. యశ్వంత్ను వీహెచ్ కలిసింది కేసీఆర్ ఇంటి వద్ద కాదని, ఎయిర్పోర్టులో అని పేర్కొన్నారు.
రాజకీయంగా కాంగ్రె్సకు ప్రధాన శత్రువు బీజేపీ అని, ఆ తరువాతే టీఆర్ఎస్ అని జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ అసలు పనికిరాడన్నారు. కాగా, రేవంత్పై జగ్గారెడ్డి బహిరంగ విమర్శలు క్రమశిక్షణా రాహిత్యమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే రేవంత్రెడ్డి మాట్లాడారని తెలిపారు. రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఇరువురు పార్టీకి రెండు కళ్లలా పని చేస్తున్నారన్నారు.


