జగన్ క్రిస్టియన్‌.. హిందువు అనడానికి ఏముంది! ఉండవల్లి సంచలన కామెంట్స్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆలయాలపై దాడులు తాజా పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో కొత్త రకం రాజకీయం మొదలైందని.. దానికి మతం రంగు పులిమారన్నారు. రామతీర్థం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామతీర్థం ఘటనకు సంబంధించిన కేసు పోలీసులకు అప్పగిస్తే 24 గంటల్లో నిందితులను పట్టుకుంటారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రామతీర్థం వెళితే.. అదే రోజు అధికారపార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారని, పోటీగా వెళ్లారా? మరి ఎందుకు వెళ్లారో అర్థం కావడంలేదన్నారు. 

జగన్ క్రిస్టియన్‌.. హిందువు అనడానికి ఏముందని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. జగన్ రుషికేస్ వెళ్లడంలో విచిత్రం ఏముందని ప్రశ్నించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సత్యనారాయణ వ్రతంలో కూర్చొన్నారని.. ఆయన కాంగ్రెస్ కాబట్టి ఎలాంటి వివాదం లేదన్నారు. జగన్ మాత్రం ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఉండవల్లి. ఎవరి మతాన్ని వారే ఆచరించాలని.. అల్లా, యేసు ప్రభువు, ముక్కోటి దేవతలు అందరూ ఎవరి నమ్మకం వారిదన్నారు. ప్రపంచంలోని మిలటరీ మొత్తాన్ని తీసుకొచ్చినా మన దేశంలో ఆలయాలకు సెక్యూరిటీని పెట్టలేమని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. 

మహమ్మద్ జిన్నా గురించి సంచలన విషయాలు తెలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. భారత్‌, పాకిస్థాన్‌ విడిపోవడానికి జిన్నాయే కారణమని అన్నారు. జిన్నా తాత రాజ్‌పుత్ వంశానికి చెందిన వారని, పూర్తి వెజిటేరియన్ అని, మాంసాహారం తినరని అన్నారు. అయితే ఆయన చేపల వ్యాపారం చేసేవారని, దీంతో ఆయనను మత పెద్దలు కుంలం నుంచి బహిష్కరించారన్నారు. ఆయనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుల సంఘాన్ని ప్రాధేయపడ్డారని, తాను చేపల వ్యాపారం చేశానే తప్ప.. ఎప్పుడూ తినలేదని, తనను మళ్లీ మతంలోకి చేర్చుకోవాలని కోరినా.. వారు కులంలో చేర్చుకోలేదు. దీంతో  జిన్నా తాత ఆ బాధతోనే చనిపోయారని ఉండవల్లి తెలిపారు. ఈ విషయం జిన్నా తండ్రి మనసులో బాగా నాటుకుపోయిందని, దీంతో ఆయన ఇస్లాంలోకి వెళ్లిపోయారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అసలు జిన్నా హిందువేనని, రాముడి వంశమని చెప్పుకుంటారన్నారు. రాముడి వంశమని చెప్పుకునేవారే భారత్‌, పాకిస్థాన్‌ విడిపోవడానికి కారకుడయ్యారని.. భిన్నత్వంలో ఏకత్వమంటే ఇదేనేమోనని తాను ఆశ్చర్యపోయానని అరుణ్ కుమార్ అన్నారు.