నాన్నిచ్చిన ధైర్యాన్ని నా నుంచి లాక్కోలేరు.. ఉద్ధవ్
Published on: Fri Jul 8, 2022 5:07PM
ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేన ఎన్నికల గుర్తును తిరుగుబాటు దారులు ఉపయోగించుకోనివ్వనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీని వారు తీసుకోగలరేమో కానీ.. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని తన నుంచి ఎవరూ లాక్కోలేరని ఆయన అన్నారు.
ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ థాక్రే తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని షిండే కు సవాల్ విసిరారు. ప్రజా మద్దతు చూరగొని అధికారం చేజిక్కించుకునే ధైర్యం లేక దొడ్డిదారిన అధికారం చేపట్టారని విమర్శించారు.
దమ్ముంటే తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి.. మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని ఎవరూ విడదీయలేరన్నారు. గత రెండున్నరేళ్లలో బిజెపి తనను, అతడిని టార్గెట్ చేసిందని, అందుకు తమ పార్టీలోని కొన్ని గ్రూపులు సహకారం అందించాయనీ ఉద్ధవ్ ఆరోపించారు. అతను వారితో టచ్ లో వుంటూ సొంత పార్టీ కి ద్రోహం చేసారని ఉద్ధవ్ థాక్రే షిండే పేరు ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు.
బెదిరింపులు వచ్చినా బెదరకుండా నిలిచి నాతో ఉన్నఎమ్మెల్యేలను చూసి గర్విస్తున్నానని ఉద్ధవ్ థాక్రే ఉద్వేగంగా చెప్పారు. సుప్రీంకోర్టు శివసేన భవిష్యత్తును మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.


