TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియుడి దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి!

Published on: Wed Apr 29, 2026 7:33PM

 

కృష్ణా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి దాడిలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కుటుంబ విభేదాలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన గొడవ చివరికి అమాయక ప్రాణాన్ని బలి తీసుకుంది.గన్నవరం నియోజకవర్గంలోని చెంచుల కాలనీకి చెందిన ఓ వివాహితకు, ఆమె భర్త స్నేహితుడైన ఖనిజం వంశీ (26)తో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఈ విషయం బయటపడిన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, రెండు నెలల క్రితం ఆమె భర్తను విడిచి, పిల్లలతో కలిసి విజయవాడ సత్యనారాయణపురంలోని తన పుట్టింటికి వెళ్లి నివాసం ఉంటోంది. అయితే, భర్తను విడిచినా ప్రియుడితో సంబంధం కొనసాగుతూనే ఉండగా, ఇటీవల ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వంశీ, అక్కడే ఉన్న రెండేళ్ల చిన్నారిపై దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను గమనించిన ఐదేళ్ల బాలుడు తన తండ్రికి విషయం చెప్పడంతో దారుణం బయటపడింది. 

వెంటనే బాధిత తండ్రి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ విభేదాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలచివేస్తోంది. ఇలాంటి సంఘటనలు కుటుంబ వ్యవస్థపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.