డియర్ మాలిక్ జీ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు?: రాహుల్ గాంధీ

 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ప్రధాని ఈ విషయమై దృష్టిసారించాలని.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఇక్కడ పర్యటించి ఆ తర్వాత మాట్లాడాలి. మీరో బాధ్యతాయుతమైన నేత అయ్యుండి ఇలా బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని మాలిక్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ కోసం ఓ విమానం పంపుతానని గవర్నర్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. "డియర్ గవర్నర్ మాలిక్. నాతో కూడిన విపక్ష నేతల బృందం, మీ ఆహ్వానం మేరకు జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటనకు వస్తోంది. మీ విమానం మాకేమీ వద్దు. అయితే, మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను కలుసుకుని, వారితో మాట్లాడే విషయంలో సహకరించండి. రాష్ట్ర నేతలను, సైనికులను కలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోకండి" అని రాహుల్ వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. పర్యటనకు రాక ముందే రాహుల్ పలు షరతులు పెట్టారని అన్నారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కలసి రావడం వల్ల కశ్మీర్ అంశాన్ని రాహుల్ రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. స్థానికుల్లో అస్థిరతను, అభద్రతా భావాన్ని మరింత ఎక్కువ చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో భారత టీవీ ఛానళ్లను చూసి రాహుల్ తెలుసుకోవాలని ఎద్దేవాచేశారు.

కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారని, ప్రజల్లో అస్థిరతను సృష్టించా లనుకుంటున్నారని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. 'డియర్ మాలిక్ జీ. నా ట్వీట్ కు మీరిచ్చిన బలహీనమైన సమాధానాన్ని చూశాను. జమ్ముకశ్మీర్ కు మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా. ఎలాంటి షరతులు లేకుండానే వస్తా. జమ్ముకశ్మీర్ ప్రజలను కలుస్తా. నన్ను ఎప్పుడు రమ్మంటారు?' అంటూ ట్వీట్ చేశారు.