జేడీ కూటమి లెక్కలు.. విజయసాయి రెడ్డి కొత్త లెక్కలు

 

జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల లక్ష్మీనారాయణ.. జనసేన పార్టీ 88సీట్లు గెలుచుకుంటుందని, తాము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. 'సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?' అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. విజయసాయి ట్వీట్ కి అదే రీతిలో లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. 'గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, జనసేన పార్టీ పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.' అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో..‘మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.’ అని ఎద్దేవా చేశారు.

దీంతో విజయ సాయి రెడ్డి మరింత రెచ్చిపోయి వరుసగా ట్వీట్లు చేశారు. 'జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ కేఏ పాల్  బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి.' అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో 'పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు.' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'His Master's Voice (HMV) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే.  ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి.'
'జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది.' ఇలా వరుస ట్వీట్లతో విజయ సాయి రెడ్డి విరుచుకు పడ్డారు.